ఎల్బీనగర్, డిసెంబర్ 13 : అధునాతన టిమ్స్ ఆసుపత్రిని నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమంగా నిర్మిం చాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. టిమ్స్ ఆసుపత్రి 26 అంతస్తులతో నిర్మించనున్నామన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు తరాల వారిని దృష్టిలో పెట్టుకుని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకునివచ్చి ఆసుపత్రి నిర్మాణంతో పాటుగా పోలీస్ స్టేషన్, రిజర్వాయర్, పార్కు, సబ్స్టేషన్, వాటర్ రిజర్వాయర్లను కూడా నిర్మించాలని ఒప్పించడం జరిగిందన్నారు. గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్ల ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేనందున మార్కెట్ స్థలంలోనే అన్ని విభాగాలకు స్థలాలు కేటాయించేలా చొరవ తీసుకున్నామన్నారు. ప్రస్తుతం టిమ్స్ ఆసుపత్రిలో 2 శ్లాబుల నిర్మాణం జరిగిందని, ప్రతి 30 రోజులకు ఒక శ్లాబ్ చొప్పున నిర్మిస్తూ ముందుకు సాగుతారన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో దేవాలయంతో పాటుగా మజీద్ను కూడా నిర్మిస్త్తామన్నారు.ఆసుపత్రితో పాటుగా ఆసుపత్రికి వచ్చే వారు కూడా స్వేద తీరేందుకు మరో భవనం నిర్మిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, రామకృష్ణ, అధికారులు సుభాష్, రాజు, ఆశాజ్యోతి, పద్మాకర్, భాస్కర్రెడ్డి, సంతోష్, కుమార్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.