సుల్తాన్బజార్, డిసెంబర్ 8 : మహాత్మాగాంధీ బస్స్టేషన్లోని స్టాళ్లలో, టాయిలెట్ల బ్లాక్లలో ప్రతిపాదించిన ధరల కంటే అధిక డబ్బులను వసూలు చేస్తున్న వారిపై టీఎస్ఆర్టీసీ కొరడా ఝులిపించింది. ఎంజీబీఎస్లో 58 స్టాళ్లలో తనిఖీలు నిర్వహించిన ఆర్టీసీ అధికారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తునట్లు గుర్తించి ఆ స్టాళ్లను రద్దు చేసే యోచన దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం ఎంజీబీఎస్లో డీవీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ రూరల్ డివిజనల్ మేనేజర్ రామచంద్రారెడ్డి హైదరాబాద్ డిపో-3 మేనేజర్ శ్రీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సుధతో కలిసి మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లోని స్టాళ్లలో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఓ ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం ఎంజీబీఎస్లోని 6 స్టాళ్లు, జేబీఎస్లోని 3 స్టాళ్లకు అడ్వాన్స్డ్ టర్మినేషన్ నోటీసులను జారీ చేశామని చెప్పారు.
ఆయా స్టాళ్లకు ఒక నెల అవకాశం ఇచ్చినట్లు, మార్పు రాకపోతే పూర్తిగా టర్మినేట్ అవుతాయని అన్నారు. అంతేకాకుండా ఎంజీబీఎస్లో రూ. 5 కంటే అధికంగా వసూలు చేస్తున్న టాయిలెట్ బ్లాక్ను పూర్తి స్థాయిలో టర్మినేట్ చేసినట్లు ఆయన వివరించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే 9959224911, 9959224910,9959226245 నెంబర్లలో సమాచారం, ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ నెంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.