రాష్ట్ర విజయగాథ విశ్వవ్యాప్తం
విజయవంతమైన స్టార్టప్గా అవతరణ
ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇంక్లూసివ్ గ్రోత్
కేంద్రం సహకరించకున్నా అద్భుత అభివృద్ధి
అమెరికా ఎన్ఆర్ఐలతో మంత్రి కే తారక రామారావు
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో అతిచిన్న వయసు రాష్ట్రమైన తెలంగాణ అద్భుత అభివృద్ధి గాథ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శనికత, నాయకత్వ పటిమతో కేవలం ఏడున్నరేండ్లలోనే దేశానికి ఆర్థిక వృద్ధిలో వెన్నెముకగా నిలిచిందని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోని వెనుకబడిన రాష్ర్టాల అభివృద్ధికి తెలంగాణ గొప్ప ఊతం ఇస్తున్నదని చెప్పారు. రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులు, ప్రవాస తెలుగువారిని ఆయన ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో అమెరికాలోని శాన్జోస్లో బుధవారం ఐటీ సేవా సంఘాల సమాఖ్య ‘ఐటీ సర్వ్ అలయెన్స్’ ఏర్పాటుచేసిన ‘ట్రీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’ కార్యక్రమంలో ప్రసంగించారు.
అద్భుత ప్రగతికి ఉదాహరణ
సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ చక్కటి ఉదాహరణగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఏడేండ్ల క్రితం ఇదే హాలులో కొత్తగా పుట్టిన తెలంగాణను మీకు పరిచయం చేయగా, ఇప్పుడు అభివృద్ధిలో ముందున్న తెలంగాణను పరిచయం చేస్తున్నాను. గత 75 ఏండ్లలో భారతదేశంలో ఇంతటి విజయవంతమైన రాష్ట్రం మరొకటి లేదు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా, ఇప్పుడు 130 రెట్లు పెరిగి రూ.2.78 లక్షలకు చేరింది. జీఎస్డీపీ రూ.4.9 లక్షల కోట్ల నుంచి 113 శాతం పెరిగి రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. దేశంలో భౌగోళికంగా తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం. కానీ జీడీపీకి అత్యధిక సంపద సమకూరుస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో పెద్ద రాష్ట్రం. కరోనా మహమ్మారి ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా 14 శాతం సీఏజీఆర్ గ్రోత్రేట్ సాధించింది’ అని వివరించారు.
త్రీ ఐ మంత్ర
తెలంగాణలో అభివృద్ధిని ఏదో ఒక రంగానికి పరిమితం చేయకుండా అన్ని రంగాలకూ విస్తరించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అనే త్రీ మంత్ర తెలంగాణ ప్రగతికి మూల సూత్రమని వివరించారు. వివిధ దేశాల్లోని పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ఐ-పాస్ పేరుతో అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెచ్చామని తెలిపారు. దీని ద్వారా 19 వేలకుపైగా అనుమతులు ఇవ్వగా, రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 16 లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. ‘రూ.70-75 వేల కోట్లతో విద్యుత్తు మౌలిక సదుపాయాలు కల్పించాం. తాగునీటి కోసం రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చుచేశాం. నీటి పైప్లైన్లతోపాటే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు కూడా వేస్తున్నాం. మరికొద్ది నెలల్లోనే పనులు పూర్తవుతాయి. వాటి ద్వారా రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు 100ఎంబీపీఎస్ వేగంతో కూడిన బ్రాడ్బాండ్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సమ్మిళిత వృద్ధిలో భాగంగా పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇటీవల కేంద్రం ఇచ్చిన టాప్ టెన్ సంసద్ ఆదర్శ గ్రామాల్లో ఏడు తెలంగాణవే ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణలో 12 అవార్డులు తెలంగాణకు వచ్చాయి. హరితహారం ద్వారా 240 కోట్ల మొక్కలు నాటాం. దీనివల్ల రాష్ట్రంలో పచ్చదనం 24 శాతం నుంచి 31.7 శాతానికి పెరిగింది. గతంలో రాష్ట్రంలో కేవలం మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు 13 ఉన్నాయి. త్వరలో మరో 20 ప్రారంభమవుతాయి’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.
కేసీఆర్ విజన్తోనే విజయాలు
రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ దూరదృష్టే కారణమని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి అన్ని రంగాలకు పవర్ హాలీడే ఉండేదని, ఇప్పుడు అవసరానికి మించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నదని తెలిపారు. ‘అప్పట్లో తెలంగాణ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7 వేల మెగావాట్లు. డిమాండ్ 9 వేల మెగావాట్ల ఉండేది. దీంతో గృహాలకే కాకుండా పరిశ్రమలకు కూడా విద్యుత్తు కోతలు ఉండేవి. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే ఈ సమస్యను కేసీఆర్ పరిష్కరించారు. నేడు తెలంగాణ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 16 వేల మెగావాట్లు. ఏడున్నరేండ్లలో రెట్టింపుకన్నా ఎక్కువ పెరింగింది. సౌర విద్యుత్తు ఉత్పత్తి 40 మెగావాట్ల నుంచి 5 వేల మెగావాట్లకు పెరిగింది. 24గంటలు రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడంతోపాటు పరిశ్రమలు, గృహావసరాలకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నాం. మిషన్ భగీరథ పథకం ద్వారా నాలుగేండ్లలోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించాం. దేశంలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జల్శక్తిశాఖ స్వయంగా ప్రకటించింది’ అని వెల్లడించారు.
నిర్మాణ అద్భుతం కాళేశ్వరం
అద్భుత కట్టడాలు, రికార్డు సమయంలో నిర్మాణాల గురించి మాట్లాడితే అందరూ చైనా పేరు చెప్తారని, కానీ తెలంగాణలో కాళేశ్వర మహాద్భుత నిర్మాణం కేవలం నాలుగేండ్లలోనే పూర్తయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం ఏదని గూగుల్లో వెదికితే కాళేశ్వరం అని వస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే ఇబ్బందులన్నింటినీ అధిగమించి రికార్డు సమయంలో ఈ బృహత్ నిర్మాణాన్ని పూర్తిచేశామని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో పండిన పంటను కొనలేమని ఎఫ్సీఐ కూడా చేతులెత్తేసిందని గుర్తుచేశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించామని చెప్పారు. ఒకప్పుడు దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణ నిజమైన అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.