కోల్కతాలో భారత్ తీన్మార్ దరువేసింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ వెస్టిండీస్పై టీమ్ఇండియా విజయదుందుభి మోగించింది. విండీస్ను వైట్వాష్ చేస్తూ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది.టాపార్డర్ విఫలమైన చోట మిడిల్లో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్..పరుగుల మోత మోగించారు. తానేంత విలువైన ఆటగాడో మరోమారు నిరూపిస్తూ సూర్యకుమార్ సిక్సర్ల మోత మోగించాడు. అయ్యర్ జతగా సూర్య సాగించిన విధ్వంసంతో టీమ్ఇండియా పోరాడే స్కోరు దక్కించుకుంది. ఆదిలో దీపక్ చాహర్ విండీస్ను దెబ్బతీస్తే…హర్షల్, అయ్యర్, ఠాకూర్ మిగతా పని పూర్తిచేశారు.
కోల్కతా: సొంతగడ్డపై తమకు తిరుగులేదని భారత్ ఘనంగా చాటిచెప్పింది. వెస్టిండీస్తో వన్డే సిరీస్ను వైట్వాష్ చేసిన టీమ్ ఇండియా పొట్టి ఫార్మాట్లోనూ అదే హవా కొనసాగించింది. కోల్కతా వేదికగా కరీబియన్లకు చుక్కలు చూపిస్తూ టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 17 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత సొంత ఇలాఖాలో భారత్కు ఇది మూడో క్లీన్స్వీప్ సిరీస్ విజయం. టీమ్ఇండియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 167/9 స్కోరు చేసింది. పూరన్(47 బంతుల్లో 61, 8ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు కాలేదు. హర్షల్ పటేల్ (3/22) మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీశారు. తొలుత సూర్యకుమార్ (31 బంతుల్లో 65, ఫోర్, 7 సిక్స్లు), వెంకటేశ్(19 బంతుల్లో 35 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స్లు) విజృంభణతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 184/5 స్కోరు చేసింది. విండీస్ బౌలర్లు తలో వికెట్ తీశారు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు సిరీస్ దక్కింది.
టాస్ గెలిచిన విండీస్..భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(4)నిరాశపర్చగా, ఇషాన్ కిషన్(34) ఆకట్టుకున్నాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రుతురాజ్ భారీ షాట్కు ప్రయత్నించి మయేర్స్ క్యాచ్ ద్వారా తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన శ్రేయాస్ అయ్యర్(25)..ఇషాన్ జతగా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. గత రెండు మ్యాచ్లకు దూరమైన శ్రేయాస్ మంచి టచ్లో కనిపించాడు. అయితే వాల్ష్ బౌలింగ్లో సిక్స్ కోసం ప్రయత్నించిన అయ్యర్..బౌండరీలైన్ దగ్గర హోల్డర్ క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్శర్మ(7) ఇలా వచ్చి అలా వెళ్లగా, సూర్యకుమార్, వెంకటేశ్ బౌండరీల మోత మోగించారు. ముఖ్యంగా సూపర్ఫామ్ మీదున్న సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షెఫర్డ్ వేసిన చివరి ఓవర్లో మూడు భారీ సిక్స్లతో విరుచుకుపడ్డ సూర్య..ఆఖరి బంతికి ఔట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఆఖరి రెండు ఓవర్లలో టీమ్ఇండియా 42 పరుగులు పిండుకుంది.
లక్ష్యఛేదనలో విండీస్కు అస్సలు కలిసిరాలేదు. చాహర్ విజృంభణతో 26 పరుగులకే ఓపెనర్లు కైల్ మయర్స్(6), షాయి హోప్(8) పెవిలియన్ చేరారు. దీంతో పూరన్, రోవ్మన్ పావెల్(25) మరోమారు మెరిసే ప్రయత్నం చేశారు. మంచి ఫామ్మీదున్న పూరన్..భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఇన్నింగ్స్ను గాడిలో పడేశాడు. మరోవైపు భారీ షాట్ ఆడే క్రమంలో పావెల్..హర్షల్ ఖాతాలో పడిపోయాడు. దీంతో విండీస్ పతనానికి ఇక్కడే నాంది పడింది. ఇక్కణ్నుంచి కరీబియన్లు ఎక్కడా కోలుకోలేకపోయారు. కెప్టెన్ పొలార్డ్(5), హోల్డర్(2), చేజ్(12) ఘోరంగా విఫలమయ్యారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్(29) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు: భారత్: 20 ఓవర్లలో(సూర్యకుమార్ 31 బంతుల్లో 65, వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 నాటౌట్, హోల్డర్ 1/29, చేజ్ 1/23), వెస్టిండీస్: 20 ఓవర్లలో 167/9(పూరన్ 47 బంతుల్లో 61, షెఫర్డ్ 29, హర్షల్ పటేల్ 3/22, చాహర్ 2/15)