న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఐబా మహిళల మెగాటోర్నీ తొలి రౌండ్లో తెలంగాణ స్టార్ నిఖత్ అలవోకగా విజయం సాధించింది. మహిళల 50 కేజీల తొలి రౌండ్లో అంఖానిమ్ ఇస్మాయిలోవా (అజర్బైజాన్)పై నిఖత్ విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆర్ఎస్సీ పద్ధతిలో నిఖత్ గెలుపొందింది.
డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ ధాటికి ప్రత్యర్థి రింగ్లో నిలువలేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే రిఫరీ బౌట్ను నిలిపివేసి నిఖత్ను విజేతగా ప్రకటించారు. ‘తొలి మ్యాచ్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. కానీ.. మున్ముందు మరింత కఠినమైన ప్రత్యర్థులు ఎదురవుతారు. అందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని నిఖత్ పేర్కొంది. రెండో రౌండ్లో రౌమైసా బౌలమ్తో నిఖత్ తలపడనుంది. ఇతర బౌట్లలో సాక్షి (52 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), శృతి యాదవ్ (70 కేజీలు) విజయాలు సాధించారు.