న్యూఢిల్లీ, జనవరి 23: భారత్తో మాల్దీవుల వివాదం వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి మాల్దీవుల దిశగా ప్రయాణం సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ చైనీస్ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తున్నదని మైరెన్ ట్రాకర్ యాప్ వెల్లడించింది. ఈ షిప్ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019, 2020లలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియెన్ సైమన్ పేర్కొన్నారు.
కాగా, మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై భారత నేవీ దృష్టి సారించింది. ఈ నౌక విషయం తమకు తెలుసునని, దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్తో గిల్లికజ్జాలు కోరుకుంటున్న విషయం తెలిసిందే. భారత్పైనా, ప్రధాని మోదీపైనా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసిన విషయం విదితమే. ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన ముయిజ్జు.. ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు వెళ్లిపోవాలంటూ డెడ్లైన్ పెట్టారు. తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెళ్తున్న పరిణామం చోటుచేసుకొన్నది. గతంలో కూడా ఇదే తరహాలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.