‘మనవి పాన్ ఇండియా మూవీస్ కాదు పాన్ వరల్డ్ కావాలి, అందుకు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కమల్ హాసన్ ‘మరో చరిత్ర’ సినిమా ప్రతి నటుడికీ గైడ్ లాంటిది. ‘దశావతారం’ లాంటి సినిమా చేసేందుకు ఇప్పుడున్న ఏ నటుడికీ ధైర్యం చాలదు. ‘ఏక్ దూజే కేలియే’తో మొదటి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇవాళ గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. మూసను రూపుమాపిన నటుడు ఆయన. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ..’ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించాను. యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. ప్రతి పాత్ర హీరోలాగే అనిపిస్తుంది. ఇదొక చరిత్ర సష్టించాలని ఆశిస్తున్నా. విడుదలకు ముందే ఈ మాట చెప్పే ధైర్యం నాకు తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు. తమిళంలో నేను నటించిన సినిమాల్లో చాలా అపజయాలు ఉన్నాయి. కానీ తెలుగులో నేను నటించిన కొన్ని చిత్రాలైనా ఎక్కువ శాతం విజయాలు దక్కాయి. నేను నటుడిగా సాధించిన ఏ ఘనతా నా ఒక్కడిది కాదు. మనవి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాలు కావాలి’ అన్నారు. ‘భారతీయ సినిమాకు కమల్ హాసన్ గర్వకారణం. ఆయన సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అన్నారు హీరో నితిన్. ఈ కార్యక్రమంలో దర్శకులు లోకేష్ కనకరాజ్, హరీష్ శంకర్, బుచ్చిబాబు, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు.
ఆశ్చర్యపరిచిన అభిమాని: హైదరాబాద్ కు చెందిన చంద్ర అనే కమల్ హాసన్ అభిమాని ‘విక్రమ్’ సినిమా తొలి ఆట షో చూసేందుకు ఓ మల్టీప్లెక్స్ లో 60 టికెట్స్ ను కొనుగోలు చేశారు. ఈ టికెట్స్ చూపిస్తూ ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.