న్యూఢిల్లీ, జనవరి 29: ఇండియాలో కొన్ని రాష్ర్టాలు, నగరాల్లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే మహమ్మారి ముప్పు ఇంకా అలాగే ఉందని డబ్ల్యూహెచ్వో రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. ‘మనం ఇంకా మహమ్మారి మధ్యలోనే ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. వైరస్ ఎండెమిక్ స్థాయికి చేరిందా అన్న ప్రశ్నకు.. ‘ఎండెమిక్ అంటే వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని కాదు’ అని సమాధానం ఇచ్చారు. కాగా, ఒడిశాకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇమ్జెనెక్స్ అభివృద్ధి చేసిన కొవిడ్ ర్యాట్ టెస్టు కిట్కు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఇది అన్ని కరోనా వేరియంట్లను గుర్తిస్తుందని ఇమ్జెనెక్స్ తెలిపింది.
కొత్తగా 2.35 లక్షల కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో (శుక్రవారం నుంచి శనివారం నాటికి) 2,35,532 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది. కొత్తగా 871 మంది మరణించారు. కర్ణాటకలో సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 1 నుంచి 9వ తరగతులకు భౌతిక తరగతులు నిర్వహించనున్నారు.
భారతీయులపై కెనడా ఆంక్షల సడలింపు
ఒమిక్రాన్ నేపథ్యంలో భారతీయ ప్రయాణికులపై విధించిన కొవిడ్ ఆంక్షలను కెనడా సడలించింది. కెనడాకు వెళ్లే భారతీయులకు ఇకపై ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదు. కరోనా నెగెటివ్ టెస్టు సర్టిఫికెట్ కూడా అక్కర్లేదు. రెండు డోసుల కరోనా టీకా టీకా వేసుకొన్న భారతీయులను తమ దేశంలోకి రావడానికి అనుమతిస్తామని కెనడా తెలిపింది. కాగా, కరోనా స్వల్ప లక్షణాలతో బయటపడినవారు కూడా లాంగ్ కొవిడ్తో బాధపడుతున్నారని లండన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.