న్యూఢిల్లీ: భారతీయ సైన్యం(Indian Army) కొత్త నిబంధన అమలు చేస్తోంది. బ్రిగేడియర్లతో పాటు ఆపై స్థాయి ర్యాంక్ అధికారులు ఇక నుంచి ఒకేరకమైన యూనిఫాం(Common Uniform)ను ధరించనున్నారు. పేరెంట్ క్యాడర్, అపాయింట్మెంట్తో సంబంధం లేకుండా ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కామన్ యూనిఫాం వల్ల సైన్యంలో వ్యత్యాసం ఉండదని, సంస్థలో సమానత్వం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు అవుతుందని ఆర్మీ పేర్కొన్నది. ఇటీవల జరిగిన ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో కామన్ యూనిఫాంపై నిర్ణయం తీసుకున్నారు.
హెడ్గియర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీలు, గార్జెట్ ప్యాచ్లు, బెల్ట్లు, షూలు అన్నీ.. ఫ్లాగ్ ర్యాంక్ ఆఫీసర్లకు ఒకేలా ఉండనున్నాయి. ఆ ఆఫీసర్లు ఇక నుంచి ల్యాన్యార్డ్ను ధరించారు. ఒకేరకమైన గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సైన్యాధికారులు తెలిపారు. బ్రిగేడియర్, అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆఫీసర్లను ఫ్లాగ్ ర్యాంక్ ఆఫీసర్లంటారు. సాధారణంగా ఆ ఆఫీసర్లు యూనిట్లను, బెటాలియన్లను కమాండ్ చేస్తారు. ఎక్కువ శాతం హెడ్క్వార్టర్స్లోనే పోస్టింగ్ ఉంటుంది. అయితే కల్నల్స్ లేదా అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ల మూనిఫాంలో మాత్రం మార్పులేదని ఆర్మీ అధికారులు తెలిపారు.