న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై లెజెండరీ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె స్పందించారు. థామస్ కప్ విక్టరీతో ఇండియా బ్యాడ్మింటన్లో సూపర్ పవర్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. థామస్ కప్ గెలుపుతో ప్రపంచ స్థాయిలో భారత్ ఘనత మరింత రెట్టింపు అయ్యిందని, ఇది వ్యక్తిగత విజయం కన్నా గొప్పదన్నారు. 14సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాను భారత పురుషుల జట్టు ఓడించి.. చరిత్రాత్మక రీతిలో 3-0 తేడాతో థామస్ కప్ను గెలుచుకున్నది.
ఇంత త్వరగా భారత్ జట్ట థామస్ కప్ గెలుస్తుందని అనుకోలేదని, ఇంకో 10 ఏళ్ల వరకు అది సాధ్యం కాదనుకున్నానని, కానీ ఇండియా ఇప్పుడు ఓ గొప్ప దశకు చేరుకున్నదని, బ్యాడ్మింటన్లో సూపర్ పవర్గా భావిస్తారని ప్రకాశ్ పదుకొణె తెలిపారు. 1980లో తొలిసారి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ను పదుకొణె గెలిచిన విషయం తెలిసిందే. తాజా గెలుపును భవిష్యత్తు విజయాలకు నాందిగా భావించాలన్నారు. టీమ్ వర్క్ వల్లే అద్భుతమైన విజయం సాధ్యమైందని అన్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పదుకొణె అన్నారు. ప్రకాశ్ పదుకొణె నేతృత్వంలో ఇండియా జట్టు 1979లో థామస్ కప్ సెమీస్ వరకు చేరుకున్నది. రాబోయే పదేళ్లకు తాజా గెలుపు దిశానిర్దేశం చేయాలన్నారు.
బ్యాడ్మింటన్లో ప్రస్తుతం పురుషుల జట్టు కొంత పర్వాలేదని, కానీ మహిళల జట్టులో బెంచ్స్ట్రెన్త్ సరిగా లేదని ప్రకాశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సైనా, సింధుకు ధీటుగా మహిళా ప్లేయర్లు ఎక్కువగా తయారీ కాలేదన్నారు. పురుషుల్లో లక్ష్య, మిథున్, కిరణ్, శ్రీకాంత్, ప్రణయ్తో పాటు గోపిచంద్ అకాడమీ ప్లేయర్లు చాలా మంది ఉన్నారని పదుకొణె అభిప్రాయపడ్డారు. వాస్తవానికి మహిళల జట్టు రెండుసార్లు బ్రాంజ్ గెలిచినా.. రాబోయే పదేళ్లకు సరిపడా వుమెన్ ప్లేయర్స్ లేరన్నారు.