పార్ల్: తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్ఇండియా.. తిరిగి పుంజుకొని సత్తాచాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరుగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. కనీసం వన్డే సిరీస్నైనా పట్టాలని భావిస్తుంటే.. పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న ప్రొటీస్ జట్టు మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగాలని చూస్తున్నది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహల్ తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపకపోగా.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ సత్తాచాటాడు. ఏండేండ్ల తర్వాత సారథ్య బాధ్యతలు లేకుండా కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగి అర్ధశతకంతో ఆకట్టుకున్న తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. మిడిలార్డర్లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. రెండో మ్యాచ్లో వీరంతా సమిష్టిగా సత్తాచాటాలని చూస్తున్నారు. లోయర్ ఆర్డర్లో శార్దూల్ ఠాకూర్ బ్యాట్తో రాణించడం టీమ్ఇండియాకు శుభపరిణామం కాగా.. బౌలింగ్లో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్ తన స్వింగ్తో రాణించగా.. గత మ్యాచ్లో పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ సేవలు ఉపయోగించుకోని టీమ్ఇండియా ఈ సారి అలాంటి తప్పిదాలు చేయకూడదని భావిస్తున్నది. స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్ సత్తాచాటితే భారత్కు తిరుగుండదు. మరోవైపు దక్షిణాఫ్రికా తరఫున డసెన్, బవుమా సెంచరీలతో ఊపు మీదున్నారు. రెండో మ్యాచ్లోనూ ఇదే కొనసాగిస్తూ ఆతిథ్య జట్టు సిరీస్ పట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఇరు జట్లు తొలి మ్యాచ్లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: రాహుల్ (కెప్టెన్), ధవన్, కోహ్లీ, శ్రేయస్, పంత్, వెంకటేశ్, అశ్విన్, శార్దూల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, మలన్, మార్క్మ్,్ర డసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, జన్సెన్, కేశవ్, ఎంగ్డీ, షంసీ.