పొట్టి ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శనతో లీగ్దశలోనే పోరాటాన్ని ముగించిన టీమ్ఇండియా.. ఆఖరి పోరులో ఓదార్పు విజయం సాధించింది. బలహీన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన కోహ్లీ సేన.. తమ గురువు రవిశాస్త్రికి విజయంతో వీడ్కోలు పలికింది. సారథిగా ఆఖరి ఇన్నింగ్స్లో విరాట్ బ్యాటింగ్కు దిగకపోగా.. మరో పది రోజుల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగనున్న సిరీస్లో రాహుల్ ద్రవిడ్ దర్శకత్వంలో కొత్త కెప్టెన్ నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది!
దుబాయ్: నాకౌట్ దారులు మూసుకుపోయాక నామమాత్రపు పోరులో టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటింది. బౌలర్ల బాధ్యతాయుత ప్రదర్శనకు.. టాపార్డర్ మెరుపులు తోడవడంతో టీ20 ప్రపంచకప్లో విజయంతో ప్రస్థానం ముగించింది. సూపర్-12లో భాగంగా సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఇప్పటికే సెమీస్ బెర్త్లు ఖాయమైపోవడంతో ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోగా.. టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీకి.. కోచ్గా రవిశాస్త్రికి విజయంతో వీడ్కోలు పలికింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డేవిడ్ వైజ్ (26) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (36 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో భారత్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 136 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (25 నాటౌట్) కూడా రాణించడంతో టీమ్ఇండియా 28 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
50 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ భారత కెప్టెన్గా వ్యవహరించాడు.
2 అంతర్జాతీయ టీ20ల్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత బ్యాటర్గా రోహిత్శర్మ(3038)నిలిచాడు. కోహ్లీ(3227) ముందున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
నమీబియా: 20 ఓవర్లలో 132/8 (వైజ్ 26; జడేజా 3/16, 3/20), భారత్: 15.2 ఓవర్లలో 136/1 (రోహిత్ 56, రాహుల్ 54 నాటౌట్; ఫ్రైలింక్ 1/19).