షార్జా: వరుస విజయాలతో జోరు మీదున్న యువ భారత జట్టు.. అండర్-19 ఆసియా కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 103 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన యువ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (90 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించగా.. కెప్టెన్ యష్ ధుల్ (26), రాజ్ బవా (23) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 38.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆరిఫుల్ ఇస్లామ్ టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో రాజ్వర్ధన్, రవి కుమార్, రాజ్ బవా, విక్కీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మరో సెమీస్లో శ్రీలంక 22 పరుగుల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. శుక్రవారం జరుగనున్న తుది పోరులో లంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 243/8 (రషీద్ 90 నాటౌట్; రకీబుల్ హసన్ 3/41), బంగ్లాదేశ్: 140 ఆలౌట్ (ఆరిఫుల్ 42; విక్కీ 2/25, రాజ్ బవా 2/26).