ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశ టెలీ సాంద్రత 86.89%
ఇయర్ ఎండింగ్ రివ్యూలో టెలికం విభాగం వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 30 : దేశంలో గత ఏడేండ్లుగా టెలిఫోన్, మొబైల్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. 2014 మార్చిలో 75.23 శాతంగా ఉన్న టెలీ-డెన్సిటీ (సాంద్రత).. 2021 సెప్టెంబర్ నాటికి 86.89 శాతానికి పెరిగింది. అప్పట్లో దేశవ్యాప్తంగా 93 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 118.9 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొబైల్ కనెక్షన్లు 1,165.97 మిలియన్ల (116.59 కోట్ల)కు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో టెలిఫోన్ కనెక్షన్లు 55 కోట్ల నుంచి 66 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 38 కోట్ల నుంచి 53 కోట్లకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగినట్టు ఇయర్ ఎండింగ్ రివ్యూలో టెలికం విభాగం వెల్లడించింది.
నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో 67వ ర్యాంక్
టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల పెరుగుదలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఇచ్చే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్(ఎన్ఆర్ఐ)లో భారత్ తన ర్యాంకును మెరగుపరచుకొన్నది. 2020 నాటికి 88 ర్యాంకులో నిలిచిన భారత్ ఇప్పుడు ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 67వ స్థానానికి చేరింది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (మధ్యాదాయ) దేశాల్లో 3వ స్థానం, ఆసియా ఫసిపిక్ దేశాల్లో 12వ స్థానంలో నిలిచింది. ఎన్ఆర్ఐలో భారత్ స్కోర్ ఏడాది వ్యవధిలో 41.57 నుంచి 49.74 శాతానికి పెంచుకొన్నట్టు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది.
ముఖ్యాంశాలు
గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్లో 10వ ర్యాంక్
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ప్రకటించే గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్ (జీఎస్ఐ)లో 2019 చివరి నాటికి 47వ ర్యాంకులో నిలిచిన భారత్.. 2020లో ఏకంగా 37 స్థానాలు మెరుగుపరుచుకొని 10 ర్యాంకుకు చేరింది. దీంతో ఆసియా ఫసిఫిక్ దేశాల్లో భారత్ 4వ స్థానంలో నిలిచింది.