న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇంత మొత్తంలో కేసులు నమోదవడం తొలిసారిగా.. మళ్లీ 133 రోజుల తర్వాత కొవిడ్ కేసులు అత్యధికంగా రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,17,87,534కు పెరిగాయి. తాజాగా మరో 26,490 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,12,31,650 మంది కోలుకున్నారు. మరో వైపు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. 24గంటల్లో 251 మరణాలు రికార్డయ్యాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1,60,692 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,95,192 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 5,31,45,709 డోసులు వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో నిన్న ఒకే రోజు 10,65,021 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 23,75,03,882 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది.