హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ తయారీలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అన్వయ కన్వెన్షన్లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో మెగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నారు. కరోనా కొత్త వేరియంట్లు వస్తున్నాయని, కానీ మన దేశీయ వ్యాక్సిన్ వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నదని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత వ్యాక్సిన్ తయారీ సంస్థను తక్కువ చేయాలని ప్రయత్నించాయని, వాటన్నింటిని ఎదుర్కొని మన వ్యాక్సిన్ అగ్రభాగాన నిలిచిందని అన్నారు.
సమాజానికి విశేష సేవలందించిన డాక్టర్ అయ్యన్న చౌదరి రామినేని తన ఫౌండేషన్ ద్వారా ఇలాంటి అవార్డు కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. అనంతరం నటుడు సోనూసూద్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించారు. నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, నటి సుమ కనకాల, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం ఎల్లాకు విశిష్ట పురస్కారాలు, హీలింగ్ హస్త హెర్బల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీ మస్తాన్ యాదవ్, ద్వారకామాయి సేవా ట్రస్ట్ ఎండీ బండ్లమూడి శ్రీనివాస్, హాస్యనటుడు, పద్మశ్రీ కే బ్రహ్మానందం, నిమ్స్ అనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్టు ఎస్వీ రామారావుకు విశేష పురస్కారాలను సీజేఐ అందజేశారు.