న్యూఢిల్లీ: భారత్లో కరోనా స్థానిక దశకు చేరుకుంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దేశంలో తక్కువ, మధ్యస్తంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ మేరకు అంచనా వేశారు. ఒక దేశ జనాభా వైరస్తో జీవించడం నేర్చుకోవడమే స్థానిక దశ. కాగా, భారతదేశానికి సంబంధించినంత వరకు, దేశ పరిమాణం, జనాభా, వైవిధ్యత నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో రోగనిరోధక శక్తి వివిధ దశల్లో కనిపిస్తున్నదని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. చాలా వరకు కేసుల పరిస్థితిలో పెరుగుదల, తగ్గుదల కొనసాగవచ్చని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో, ప్రత్యేకించి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో, మొదటి, సెకండ్ వేవ్కు తక్కువగా ప్రభావితమైన ప్రాంతాలు లేదా తక్కువ స్థాయిలో టీకా కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో రాబోయే నెలల్లో కరోనా కేసుల పెరుగుదల నమోదు కావచ్చని సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. పిల్లల్లో కరోనా వ్యాప్తిపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ప్రభావం లేదని పలు సర్వేల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. 2022 చివరి నాటికి 70 శాతం మేర కరోనా టీకా కవరేజీని సాధించవచ్చని, ఆ తర్వాత దేశాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు.