న్యూఢిల్లీ: సినిమాలు నిర్మిస్తున్న దేశాల్లో ఇండియా అతిపెద్ద దేశమని ప్రధాని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రత్యేక సందేశం రిలీజ్ చేశారు. సినిమాలు, సమాజం ఒకటికి ఒకటి ప్రతిబింబాలన్నారు. మానవ భావోద్వేగాలను సినిమాలు కళాత్మకంగా చూపిస్తాయని, ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఇండియాలో భిన్నమైన భాషల్లో వివిధ ప్రాంతాల వారు సినిమాలు తీస్తున్నారని, ఇది అసాధారణమని ప్రధాని తెలిపారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సారి ప్రఖ్యాత డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన సినిమాను స్క్రీనింగ్ చేయడం గొప్ప విషయం అన్నారు. తాజా ఎడిషన్ ఎంతో ప్రత్యేకమైందని, ఎందుకంటే ఇండియాలోని అనేక స్టార్టప్లు ప్రపంచ సినిమాకు తమ సత్తా చాటనున్నట్లు ఆయన చెప్పారు.
కేన్స్లో ఏర్పాటు చేసిన ఇండియన్ పెవిలియన్ను రేపు ఆవిష్కరించనున్నారు. భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈసారి కేన్స్ ఫెస్టివల్లో ఆరు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాలను అఫిషియల్ స్క్రీనింగ్ జాబితాలో లేవు. కానీ వీటిని కేన్స్ ఫిల్మ్ మార్కెట్లో ప్రదర్శించనున్నారు. ఇందులో అన్నీ ప్రాంతీయ చిత్రాలే ఉంటాయి. ఆ జాబితాలో రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్, గోదావరి, దుయిన్, ఆల్ఫా బీటా గామా, బూంబా రైడ్, నిరయి తాతకుల్ల మారమ్ చిత్రాలు ఉన్నాయి.