భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి సమరానికి వేళయైంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకున్న టీమ్ఇండియా గెలుపు జోరు మీదుంటే.. వరుస ఓటములతో కివీస్ తడబడుతున్నది. టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని సిరీస్ విజయంతో తుడిచిపెట్టేందుకు రోహిత్సేన ప్రయత్నిస్తుంటే.. మెగాటోర్నీలో టైటిల్ను చేజార్చుకున్న కివీస్ గాడిలో పడేందుకు కష్టపడుతున్నది. ఈ నేపథ్యంలో క్లీన్స్వీప్పై కన్నేస్తూ భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తున్నది.
కోల్కతా: టీ20 కెప్టెన్గా రోహిత్శర్మ పూర్తిస్థాయి బాధ్యతలు అందుకున్న తర్వాత భారత్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. సొంతగడ్డపై న్యూజిలాండ్ భరతం పడుతూ జైపూర్, రాంచీలో విజయాలతో సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో జరిగే మూడో మ్యాచ్లోనూ కివీస్ను ఓడించి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలన్న కసితో టీమ్ఇండియా కనిపిస్తున్నది. మరోవైపు తీరికలేకుండా మ్యాచ్లు ఆడుతున్న కివీస్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్..పొట్టి సిరీస్కు ముందే దూరం కాగా, టిమ్ సౌథీ సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపలేకపోతున్నాడు. ఇదే అదనుగా టీమ్ఇండియా చెలరేగుతున్నది.
ప్రయోగాలకు చాన్స్
ఇప్పటికే సిరీస్ ఖాతాలో వేసుకున్న భారత్..ప్రయోగాలకు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటే కొందరికి విశ్రాంతి ఇవ్వనున్నారు. కివీస్తో రెండు టెస్టు మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్ను బెంచ్కు పరిమితం చేస్తే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా రావచ్చు. మిడిలార్డర్లో పంత్కు బదులుగా వికెట్కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్..ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని తప్పిస్తే..యువ పేసర్ అవేశ్ఖాన్ అరంగేట్రానికి దారులు తెరుచుకున్నట్లే. గాయపడ్డ హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్ తొలి మ్యాచ్లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
జట్ల అంచనా
భారత్: రోహిత్(కెప్టెన్), రాహుల్, రుతురాజ్/సూర్యకుమార్, శ్రేయాస్, పంత్, వెంకటేశ్, అక్షర్పటేల్, అశ్విన్, చాహర్, అవేశ్ఖాన్/భువనేశ్వర్, హర్షల్ పటేల్
న్యూజిలాండ్: సౌథీ
(కెప్టెన్), గప్టిల్, మిచెల్, చాప్మన్, ఫిలిప్స్, సిఫెర్ట్, నీషమ్, సాంట్నర్, మిల్నె, సోధీ, బౌల్ట్.
కివీస్ కష్టంగా
టీ20 ప్రపంచకప్ ఓటమి నుంచి పూర్తిగా తేరుకోకముందే భారత గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నది. దాదాపు రెండు వారాల వ్యవధిలోనే ఐదు మ్యాచ్లు ఆడి ఒక రకంగా అలసిపోయిన కివీస్ క్రికెటర్లకు అదృష్టం కూడా కలిసిరావడం లేదు. రెండు మ్యాచ్ల్లోనూ టాస్ కోల్పోవడం వారి గెలుపు అవకాశాలపై ప్రభావం చూపిందని చెప్పొచ్చు. దీనికి తోడు ఆఖరి ఓవర్లలో అనుకున్న రీతిలో పరుగులు సాధించకపోవడం వారిని ఓటమి వైపు నిలుపుతున్నాయి. కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో కివీస్ కనిపిస్తున్నది.