న్యూఢిల్లీ, సెప్టెంబర్ 85: కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ(హెచ్డీఐ)లోనూ భారత ర్యాంకు పడిపోయింది. 2021 ఏడాదికి గానూ 191 దేశాలకు ర్యాంకులు కేటాయించగా, భారత్ 132వ స్థానంలో నిలిచింది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక ర్యాంకు దిగజారింది. 2020లో భారత్ ర్యాంకు 131 కాగా, అంతకుమునుపు ఏడాది 129వ స్థానంలో ఉండేది. ఆయుర్దాయం, విద్యా స్థాయిలు, జీవన ప్రమాణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయిస్తారు. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కూడా మనకంటే ముందున్నాయి.
తగ్గిన ఆయుర్దాయం
భారత్లో హెచ్డీఐ స్కోరు 2019లో 0.645 ఉండగా, 2021లో 0.633కి పడిపోయింది. ఆయుర్దాయం 69.7 ఏండ్ల నుంచి 67.2 ఏండ్లకు పడిపోవడమే ఇందుకు కారణం. కరోనా మహమ్మారి కారణంగా మానవాభివృద్ధి సూచిక వరుసగా రెండేండ్లు (2020,21) క్షీణించిపోయిందని యూన్డీపీ పేర్కొన్నది. ప్రపంచ ఆయుర్దాయం 2019లో 73 ఏండ్లు ఉండగా, 2021లో 71.4 ఏండ్లకు తగ్గిందని వెల్లడించింది. గత 30 ఏండ్లలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే తొలిసారి అని వివరించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలను మరింత ముదిరేలా చేసిందని తెలిపింది.