న్యూఢిల్లీ, జనవరి 18: రెండు, మూడు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు కొనసాగితే కొవిడ్ రోగులు టీబీ(క్షయవ్యాధి), ఇతర పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అదేవిధంగా కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు వారికి స్టెరాయిడ్స్ సూచించడం ఆపాలని పేర్కొన్నది. ఈ మేరకు సవరించిన క్లినికల్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. స్టెరాయిడ్స్ను వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది. మధ్యస్థం నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న రోగుల్లో, ఏదైనా లక్షణం కనిపించిన 10 రోజుల్లోగా మూత్రపిండాలు లేదా కాలేయం పనితీరులో ఇబ్బందులు లేని రోగులకు రెమ్డెసివిర్ వినియోగించొచ్చని తెలిపింది. అయితే ఆక్సిజన్ సపోర్టుపై లేని లేదా హోఐసొలేషన్లో ఉండే వారికి ఈ డ్రగ్స్ వినియోగించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. తీవ్ర లక్షణాలు లేదా ఐసీయూలో చేరిన 24 నుంచి 48 గంటల్లోగా టొసిలిజుమాబ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది. పలు రాష్ర్టాలు, యూటీల్లో కరోనా పరీక్షలు తగ్గడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టులను పెంచాలని కోరింది.
15-18 ఏండ్ల వయసున్న టీనేజర్లకు కొవాగ్జిన్ టీకాను మాత్రమే వేయాలని, అయితే, ఇతర వ్యాక్సిన్లు వేస్తున్నట్టు తమకు రిపోర్టులు వస్తున్నాయని కొవాగ్జిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. టీకా వేసేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.12-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
2.38 లక్షల కొత్త కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628కి పెరిగింది. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 3,76,18,271కి చేరింది. ఇందులో 8,891 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయి. వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా 310 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. పాజిటివిటీ రేటు 14.43గా నమోదైంది.