IND vs NZ : మూడో వన్డేలో భారత్, కివీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101) సెంచరీలతో చెలరేగి శుభారంభం ఇచ్చారు. మిడిలార్డర్ మరోసారి విఫలం అయింది. అయితే.. చివర్లో హార్దిక్ పాండ్యా (54), శార్దూల్ ఠాకూర్(25)తో కలిసి స్కోర్ను 350 దాటించాడు. అతను 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దూకుడుగా ఆడే క్రమంలో లాంగాఫ్లో షాట్కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. రోహిత్, గిల్ జోరు చూస్తుంటే భారత్ 400 రన్స్ చేస్తుందని అనిపించింది. కానీ, వాళ్లిద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చి న కోహ్లీ (35), ఇషాన్, సూర్య విఫలమయ్యారు. జాకబ్ డఫీ కోహ్లీ, సూర్య వికెట్లు తీసి భారత్ను దెబ్బ కొట్టాడు. కివీస్ బౌలర్లలో టిక్నర్, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు తీశారు. బ్రేస్వెల్కు ఒక వికెట్ దక్కింది.
ఓపెనర్లు హిట్
టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాంటిగ్కు అచ్చొచ్చిన ఇండోర్ పిచ్పై భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీరబాదుడు బాదారు. కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. హిట్మ్యాన్, ఆ వెంటనే గిల్ శతకాలు పూర్తి చేసుకున్నారు. గిల్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 బంతుల్లోనే 112 రన్స్ చేశాడు. ఇద్దరు పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్టేడియాన్ని హోరెత్తించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్కు న్యూజిలాండ్పై 212 రన్స్ జోడించారు.