న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.504.35 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇండియా. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.493.50 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం అధికమని పేర్కొంది. కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 7.8 శాతం అధికమై రూ.2,941.75 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.2,728.84 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు 7.65 శాతం పెరిగి రూ.2,388.53 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదుకాలేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ షేరు ధర 2 శాతం అధికమై రూ.557.40 వద్ద నిలిచింది.