ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్హాల్లో గురువారం మేయర్ నీరజ అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.320.98 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక బడ్జెట్కు పాలకవర్గ సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ ఆదర్శ్సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోనే ఖమ్మం నగరంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అన్నిప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రగతిని చూడలేని కొందరు అవాస్తవాలు మాట్లాడుతూ.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నగర రూపురేఖలు మార్చామని చెప్పారు.
ఖమ్మం, మార్చి 3: ఈ సారి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఖమ్మానికి తీపికబురు తెస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మమని స్పష్టం చేశారు. నగరంలో వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఇతర ప్రాంతాల ప్రజలు సంతోషిస్తుంటే ఖమ్మం నగరానికి చెందిన కొందరు దుర్బుద్ధితో మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నగర రూపురేఖలు మార్చి సమగ్రాభివృద్ధి చేయగలిగామని అన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన కేఎంసీ కౌన్సిల్ హాల్లో గురువారం జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శక పాలన అందిస్తుండడంతో ఖమ్మానికి మహర్దశ పట్టిందని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా ఖమ్మానికి రూ.2.70 లక్షల నిధులు వస్తున్నాయన్నారు. గోళ్లపాడు కాలువపై 100 కోట్లతో దాదాపు 11 కిలోమీటర్ల మేర అండర్ డ్రైనేజీ పైపులైన్ నిర్మించి త్రీటౌన్ ప్రజల సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న 30 ఏళ్లకు సరిపడా పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేషన్ నిధులనే కాకుండా ఇతర నిధులను నగరాభివృద్ధికి కేటాయించామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, డ్రెయిన్లు వంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ఖమ్మం అభివృద్ధికి శ్రమిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
చిన్న పట్టణంగా ఉన్న ఖమ్మం.. పెద్ద నగరంగా విస్తరించడం వెనుక గత పాలకవర్గాలు చేసిన మంచి కృషిని గుర్తుచేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజల మనసు గెలుచుకోవడమే ప్రజాప్రతినిధుల లక్ష్యమన్నారు. ఈ కార్యాలయంలో ఇదే చివరి సమావేశమని, త్వరలోనే నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటామని అన్నారు. సంస్థ ఆదాయం పెంచేలా పెంచేలా ఆలోచన చేయాలని సభ్యులకు సూచించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.320.98 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్ను మేయర్ నీరజ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నిరుడు రూ.210 కోట్లతో బడ్జెట్ను రూపొందించామని, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.110 కోట్లు పెంచి అంచనాలు రూపొందించామన్నారు.
ఇంటి పన్నుల నుంచి రూ.29.27 కోట్లు, స్టాంప్ డ్యూటీ రూ.5.02 కోట్లు, కేఎంసీ భవనాల అద్దెలు రూ.13.39 కోట్లు, పారిశుధ్య విభాగం నుంచి రూ.2.97 కోట్లు, ప్రణాళికా విభాగం నుంచి రూ.19.20 కోట్లు, ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ.2.17 కోట్లు, ప్రణాళికేతర నిధులు రూ.28.82 కోట్లు, ప్రణాళిక నిధులు రూ.100 కోట్లు, ఇతర ఆదాయం రూ.117 కోట్లు కేఎంసీకి వస్తాయన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు రూ.25 కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.7.47 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.9.20 కోట్లు, రుణాల చెల్లింపులు రూ.1.77 కోట్లు, గ్రీన్ బడ్జెట్ రూ.8.78 కోట్లు, ఇంజినీరింగ్ విభాగం నిర్వహణ రూ.4.15 కోట్లు, సాధారణ పరిపాలనా వ్యయం రూ.4.11 కోట్లు, ప్రణాళికా విభాగం వ్యయం రూ.70 లక్షలు, విలీన పంచాయతీలకు కేటాయింపులు రూ.3.30 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.35 లక్షలు, డివిజన్ బడ్జెట్ రూ.5.99 కోట్లు, ఇతర రుణాల చెల్లింపు రూ.2.50 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.28.82 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.100 కోట్లు, ఇతర వ్యయం రూ.117 కోట్లుగా అంచనాలు రూపొందించామని మేయర్ వివరించారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
నూతన మున్సిపల్ చట్టం ద్వారా కేఎంసీ బడ్జెట్ను రూపొందించామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. నెల రోజులు కసరత్తు చేసి బడ్జెట్ను రూపొందించామని, అన్ని ప్రాంతాలకూ సమాన ప్రాతినిథ్యం కల్పించామని కమిషనర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.
కౌన్సిల్లోని ప్రతిపక్ష సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని టీఆర్ఎస్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ సూచించారు. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అది వారికి కానరాకపోవడం శోచనీయమని అన్నారు. మరికొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కమర్తపు మురళి, నీరజ, రుద్రగాని శ్రీదేవి, సీపీఐ కార్పొరేటర్ క్లెయిమెంట్ మాట్లాడారు. అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఈఈలు రంజిత్కుమార్, కృష్ణలాల్ తదితరులు పాల్గొన్నారు.