రోజురోజుకూ తరిగిపోతున్న అడవులను సంరక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. అందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడను పంచుతున్నాయి. ఐదారేండ్ల కింద నాటిన మొక్కలు వనాన్ని తలపిస్తుండగా ఆయా ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏపుగా పెరిగిన మొక్కలు హరితహారం లక్ష్యాలను కళ్లకు కడుతున్నాయి. కళాశాల ఆవరణ మొత్తం పచ్చని చెట్లు, రకారకాల పూలు, పండ్ల మొక్కలతో నిండిపోయింది. పార్కును తలపించే వాతావరణంలో విద్యార్థులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంతి సమయంలో భవనం వెలుపల చెట్లకింద ప్రశాంత వాతావరణంలో సేదదీరుతున్నారు.
కళాశాల వాతావరణం పచ్చదనంతో నిండిపోయింది..
హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో నాటిన మొక్కలు పెరిగిపెద్దయ్యాయి. ఆవరణ అంతా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. కళాశాల సిబ్బంది, విద్యార్థులు హరితహారంలో భాగస్వాములై మొక్కలను సంరక్షించడంతోనే ఈ మార్పు సాధ్యమైంది.