యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీలో చేరిన కొత్త వారు అప్పుడే బయటకు వస్తున్నారు. బీజేపీలో ఆధిపత్య పోరు, ప్రాధాన్యం లేకపోవడం, పార్టీ వైఖరి నచ్చకపోవడంతో వంటి కారణాలతో కొత్తగా చేరిన వారంతా అందులో ఇమడలేక పోతున్నారు. ఆ పార్టీలో చేరిన కొన్ని రోజులకే వాపస్ వస్తున్నారు. నేతలే కాదు కిందిస్థాయి నాయకులు సైతం బీజేపీని వీడుతున్నారు. వారంతా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్లోకి వస్తున్నారు. మరోవైపు ఆ పార్టీలో అప్పుడే పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ తారస్థాయికి చేరుకొన్నది. కమలం పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలు తమకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. తన ప్రాభవం, బలం నిరూపించుకోవాలనే ఉత్సుకతతో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహించారు. అయినోళ్లను, కానోళ్లను అందరినీ చేర్చుకొంటున్నారు. పార్టీలో చేరిన ఒకటి, రెండు రోజులకే వీరంతా ఎందుకొచ్చామా? అనే ఆవేదన చెందుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే తీరు, పార్టీ వైఖరి, సీనియర్ నేతలతో ఏకాభిప్రాయం కుదరకపోవడం, ప్రాధాన్యం దక్కకపోవడంతో కమలం పార్టీలో చేరిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఉండే పరిస్థితి లేక పార్టీని వీడుతున్నారు. కొంత మంది ఆ పార్టీలో చేరిన రోజే వెనక్కి వస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు.. అక్కడి నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొంటున్నారు. గత ఇరవై రోజులుగా ఇలా నిత్యం వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన చండూరు మండలంలోని దోనిపాముల సర్పంచ్, చొప్పరివారిగూడెం సర్పంచ్, నాంపల్లి మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. మరికొందరు మాత్రం బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారు.
మొన్నటి వరకు మునుగోడు బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. కానీ ఇటీవల ఇతర పార్టీల నేతల చేరికలతో కొత్త పంచాయితీ షురూ అయ్యింది. పార్టీని ఎప్పటి నుంచో అంటి పెట్టుకొని ఉన్న నేతలను కాదని కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాత నేతలకు తెలియకుండా నిర్ణయాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పాతోళ్లంతా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బహిరంగంగానే వీరు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చలకు తెరలేపుతున్నారు. తమ బాధను స్టేటస్, ఫేస్బుక్ పోస్టుల రూపంలో వెల్లగక్కుతున్నారు. బీజేపీలో ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడం తో కార్యకర్తలు కూడా కలత చెందుతున్నారు.