మక్తల్ టౌన్, డిసెంబర్ 8 : విధి నిర్వహణలో భాగంగా ఏఎన్ఎం తన స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన నా రాయణపేట జిల్లా మక్తల్ మండలం వడ్వాట్ గేటు వద్ద చోటు చేసుకున్నది. ఎస్సై రాములు కథనం మేరకు.. మక్తల్ పట్టణానికి చెందిన వరలక్ష్మి(28) మాగనూరు పీ హెచ్సీ పరిధిలోని కొల్పోర్ గ్రామ సబ్సెంటర్లో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నది. నిత్యం మక్తల్ నుంచి విధులకు వెళ్లేది. ఈ క్రమంలో బుధవారం ఉదయం మక్తల్ నుంచి తన స్కూటీపై మాగనూరు పీహెచ్సీకి వెళ్లింది. అక్కడ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కొల్పూరుకు బయలుదేరింది. వడ్వాట్ గేటు సమీపంలోకి రాగానే నేషనల్ హైవే-167పై కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్కు ఐరన్ మట్టి లోడ్తో వెళ్తున్న లారీ (ఏపీ 02 టీఈ 5477) వెనుక నుంచి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. లారీని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దవాఖాన వద్దకు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలు సుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు
జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి హరీశ్రావు
కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని ప్రభుత్వం అన్ని విధా లా ఆదుకుంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రోడ్డు ప్రమా దంలో ఏఎన్ఎం వరలక్ష్మి మృతి చెందగా.. మంత్రి హరీశ్రావు స్పందించారు. మృతు రాలి కుటుంబానికి రూ.50 లక్షల బీమా సొమ్ముతోపాటు కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే వరలక్ష్మి అంత్యక్రియలను ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించాలని సూచించారు.