KP Vivekananda | దుండిగల్, మే 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను మోడల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేశామని ఆ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్, 17వ డివిజన్ కౌసల్య కాలనీ, 18వ సాయి అనురాగ్, 20వ డివిజన్లలోని పూజిత ఎన్క్లేవ్ల్లో శనివారం నాడు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు, ఆయా ప్రాంతాలలో నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు కాలుష్యం, తదితర సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నిజాంపేట కార్పొరేషన్ను అభివృద్ధి చేశామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా వెలుస్తున్న కాలనీలల్లో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజానీకానికి రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు.