జైపూర్ : రాజస్ధాన్ ప్రభుత్వం పేదలకు చౌక ధరకు భోజనం సమకూర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా రసోయి యోజన అపరిశుభ్రతకు ఆవాసంగా మారింది. ప్రభుత్వ భోజన కేంద్రంలో పాత్రలను పందులు నాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భరత్పూర్లోని ఎంఎస్జే కాలేజ్ ఎదురుగా ఉన్న మీల్ సెంటర్లో పందులు తిరుగుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఈ కిచెన్ను మదర్ థెరిస్సా పేరుతో ఉన్న ఓ సంస్ధ నిర్వహిస్తోంది. ఇందిరా రసోయి యోజన పేరుతో పేదలకు రూ 8కి భోజనం అందించే పధకాన్ని రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్ ప్రారంభించారు.
రూ 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 25 ఇందిరా రసోయి కిచెన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక భోజన శాల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతున్న వీడియో వైరల్ కావడంతో భరత్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సదరు కాంట్రాక్ట్ను రద్దు చేసి సంస్ధకు నోటీసులు ఇచ్చింది.