న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది. గత నెలలో ముంబై వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు వచ్చిన ముగ్గరు మైనర్ బాలికలను గమనించిన వ్యక్తి వారి వద్దకు వచ్చి టికెట్లు బుక్ చేయడంలో సహకరిస్తానని నమ్మబలికాడు.
ముగ్గురు బాలికలను నిందితుడు రోహిణిలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు బాలికలకు పానీయంలో మత్తు మందు కలిపి ఇవ్వగా స్ప్రహ కోల్పోయిన బాలికలపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు తమను ముంబైకి పంపాలని బాలికలు కోరగా రాజస్ధాన్లో వారికి పెండ్లి జరిపిస్తానని చెప్పాడు.
ఆపై కశ్మీరీ గేట్కు చేరుకోగానే బాలికలు నిందితుడి చెర నుంచి బయటపడి జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. కుటుంబసభ్యుల సహకారంతో బాలికలను డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తరలించి స్టేట్మెంట్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి కేసు వివరాలను వెల్లడించాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.