బేగంపేట్ మే 4: ఎన్నికల గడువు సమీస్తున్నందున ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత విస్తృతం చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రచారం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి లభిస్తున్న స్పందన గురించి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలకు కేవలం కొద్ది సమయం మాత్రమే గడువు ఉన్నందున ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలని, దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో తెలియ జెప్పాలన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ అభ్యర్థి పద్మారావుకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
కేంద్రమంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండని కిషన్రెడ్డిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారంలో అర్థం అవుతుందని వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, పద్మారావు గెలుపు ఖాయమని ఆయన అన్నారు. జబ్బార్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన కేటీఆర్ రోడ్డు షోకు భారీ సంఖ్యలో హాజరైన అశేష ప్రజానికాన్ని చూస్తే గెలుపు తథ్యమని స్పష్టం అవుతుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు శేషు కుమారి డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బాల్రెడ్డి, ఆకుల హరికృష్ణ, వెంకటేశం రాజు, పవన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఆదివారం ఉదయం 9 గంటలకు రాంగోపాల్పేట్ డివిజన్లోని మినిస్టర్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, అభ్యర్ధి పద్మారావు గౌడ్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.