లక్నో : పరీక్షలో తప్పు చేశాడని పదవ తరగతి చదివే దళిత విద్యార్ధిని స్కూల్ టీచర్ చావబాదిన ఘటన యూపీలోని ఔరియలో కలకలం రేపింది. గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బాధితుడు నిఖిల్ దోహ్రే సెప్టెంబర్ 7న జరిగిన పరీక్షలో తప్పు చేశాడనే కోపంతో సోషల్ సైన్స్ టీచర్ దారుణంగా కొట్టాడు.
దీంతో బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సెప్టెంబర్ 24న నిఖిల్ తండ్రి రాజు దోహ్రే అచల్ధ పోలీస్ స్టేషన్లో టీచర్పై ఫిర్యాదు చేశాడు. బాలుడి వైద్యానికి సాయం అందించడం లేదని, కులం పేరుతో తమను దూషిస్తున్నాడని ఆరోపించాడు.
దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అశ్వని సింగ్ కోసం గాలిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, బాలుడి మృతి కేసుపై దర్యాప్తునకు ఆదేశంచామని ఔరియా ఎస్పీ చారు నిగం వెల్లడించారు.