ఎలాగైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడానికి ఆరాట పడుతున్న మోదీ సర్కారు.. ప్రైవేటు ప్రమోటర్లు ఎలా చెప్తే అలా నడుస్తున్నది. అగ్గువకే పీఎస్యూలను బిడ్డింగ్లో దక్కించుకోవడానికి ఎన్నో రాయితీలు, మినహాయింపుల్ని ప్రమోటర్లు కోరుతున్నారు. కేంద్రం దానికీ ఊ కొడుతున్నది.
పీఎస్యూల నుంచి వ్యాపారేతర ఆస్తుల్ని వేరుచేయండి: ప్రైవేటు ప్రమోటర్లు మీరు చెప్పిందే చేస్తాం: కేంద్ర ప్రభుత్వం
కంపెనీని కొన్న తర్వాత ఓపెన్ ఆఫర్ భారాన్ని తొలగించండి: కార్పొరేట్లు
సెబీతో మాట్లాడి అదే పనిచేస్తాం: సర్కారు
టేకోవర్ తర్వాత కూడా కనీస పబ్లిక్ వాటా నిబంధనకు వీల్లేదు: ప్రైవేటు
జీ హుజూర్..మీరు ఎలా చెపితే అలా: ప్రభుత్వం
న్యూఢిల్లీ, జనవరి 3: ద్రవ్యలోటు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏదోవిధంగా ప్రభుత్వ కంపెనీల్ని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం, 6.4 శాతం ద్రవ్యలోటు లక్ష్యం నెరవేరాలంటే ఇప్పటికిప్పుడు అర్జంటుగా ఒకట్రెండు కంపెనీలను విక్రయించాల్సిందే. మరో మార్గం లేదు. దీంతో హుటాహుటిన కనీస పబ్లిక్ వాటా నిబంధన నుంచి ప్రైవేటు ప్రమోటర్లకు వెసులుబాటు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అది ఏమిటంటే..
ఆగమాగం..
ఐడీబీఐ బ్యాంక్ను విక్రయించడానికి కొద్ది నెలలుగా కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ బ్యాంక్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ సమర్పించడానికి జనవరి 7 చివరి తేదీ. ఆసక్తిగల బిడ్డర్ల కోరిక మేరకు ఇప్పటికే 51 శాతం వాటాను విదేశీ ఫండ్స్ కొనుక్కునే వెసులుబాటు కల్పించింది. ప్రైవేటు ప్రమోటర్లు కొనుగోలు చేసిన తర్వాత ఎంపీఎస్ మినహాయింపు వర్తించేలా గెజిట్ విడుదల చేసింది. బ్యాంక్లో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా (ఎల్ఐసీ ద్వారా) 94.7 శాతం వాటా ఉంది. ఇందులో 60.7 శాతం వాటాను విక్రయించనుంది.
మెజారిటీ వాటా విక్రయం పూర్తయిన తర్వాత ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటు సంస్థగా మారిపోతుంది. దీంతో ప్రమోటర్లు 20 శాతం వాటాను మార్కెట్లో పబ్లిక్కు విక్రయించి 75 శాతం వాటానే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే కొనుగోలు చేసిన ప్రైవేటు ప్రమోటరు కొంత శాతం, ప్రభుత్వం మరికొంత శాతం విక్రయిస్తేనే అది సాధ్యపడుతుంది. దీంతో ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకు బిడ్డింగ్ చేయడానికి ముందుకురారు. ఈ కారణంగానే కేంద్రం ఆఘమేఘాల మీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.