హయత్నగర్ రూరల్, నవంబర్ 26 : ప్రజాసేవలో తక్షణ స్పందనకు రాష్ట్ర పోలీసులు చిరునామాగా నిలుస్తున్నారు. ‘ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి’ అని సమాచారం వెళ్లడమే ఆలస్యం నిమిషాల్లో వాలిపోతున్నారు. ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు. ముఖ్యంగా 100 నంబర్కు వస్తున్న ఫోన్ కాల్స్తో ఇటీవల ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. సమస్యలను తెలుసుకుని.. కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో భరోసా నింపుతున్నారు. తాజాగా విశ్రాంత ఐపీఎస్లకు సంబంధించిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్).. కన్సాలిడేట్ స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలోనూ తక్షణ స్పందనలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ఫస్ట్గా నిలిచారు. నిత్యం వేలల్లో ఫోన్కాల్స్ వస్తున్నా.. ప్రతి కాల్పై పర్యవేక్షణ కారణంగా సత్ఫలితాలు సాధిస్తున్నారు. జాతీయస్థాయిలోనూ ప్రశంసలు అందుకుంటున్నారు.
సమాచారం రాగానే వెళ్తున్నాం
ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది లేదంటే పోలీసులం ఘటనాస్థలికి వెళ్లిపోతున్నాం. జాతీయ రహదారిపై ప్రయాణికులకు సైతం ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే స్పందిస్తున్నాం. వారికి సాయం అందిస్తున్నాం. బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నాం.