Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం ఉంటుందని చెప్పింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.