యాచారం, మే 20 (నమస్తే తెలంగాణ): కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లో పనులు ఎలా చేపడతారంటూ ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పంతం సత్తమ్మకు చెందిన సర్వే నంబర్ 311లోని పొలం నుంచి ఫ్యూచర్సిటీ రోడు ్డకోసం బుధవారం అధికారులు పోలీస్ పహారాలో పనులు చేపట్టారు.
కోర్టు స్టే ఉండగా పనులు చేయొద్దని, పైగా అసైన్డ్ భూమికిగాను సత్తమ్మ పొలానికి సగం నష్టపరిహారంతోపాటు ప్లాట్లు ఇవ్వలేదని, పొలంలో ఎలాంటి పనులు చేయొద్దని కుటుంబీకులు అధికారులను కోరారు. అయినప్పటికీ పోలీసుల సహకారంతో అధికారులు, సిబ్బంది పొలంలో ఉన్న పశువులకొట్టాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే బోర్లు, పశుగ్రాసం ధ్వంసం చేశారు. పశువుల కొట్టంలో ఆవులు, లేగదూడలు ఉం డడంతో దాన్ని కూల్చకుండా రైతు కుటుంబసభ్యులు అడ్డుకొన్నారు.
దీంతో రైతులు పంతం మధు, పంతం మణికంట, పంతం జంగయ్య, పంతం అలివేలును పోలీసులు అరెస్ట్ చేసి గ్రీన్ ఫార్మాసిటీ స్టేషన్కు తరలించారు. రైతుల అరెస్ట్ను ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది. కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ.. రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడమే ప్రజాపాలనా? అంటూ ప్రశ్నించారు. స్టే ఆర్డర్ ఉండగా పనులు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ రాజు, సీఐ సత్యనారాయణ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఇస్తామని చెప్పిన ఫార్మా ప్లాట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.