న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మతో పాటు టీవీ జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ అంశంలో రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధులతో పాటు జర్నలిస్టు, సోషల్ మీడియా యూజర్లు, ఇతర మత సంస్థలపై కేసు ఫైల్ చేశారు. నుపుర్ శర్మ టీవీ చర్చలో కామెంట్ చేయగా, నవీన్ కుమార్ జిందాల్ ఆమెకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరిపై కేసు బుక్ చేశారు. నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ అరబ్ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. విద్వేషపూరిత అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై కూడా కేసు నమోదు చేశారు.
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (ఐఎఫ్ఎస్వో) ఈ కేసును బుక్ చేసింది. జర్నలిస్టు సాబా నక్వీ పేరును కూడా కేసులో నమోదు చేశారు. పూజా షాకూన్ పాండే, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుల్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలు కూడా ఉన్నారు. మతంతో సంబంధం లేకున్నా చాలా మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.