KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని తెలిపారు. మీరు నాకు బలమిస్తే.. సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత నాది అని కేసీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాను కాపాడుకునేందుకు ఎంతకైనా ఉద్యమం చేద్దామని స్పష్టంచేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నాడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా.. గోదావరి జలాలను కాపాడుకోవాలన్నా.. మన నేత కార్మికుల బతుకులు బాగుండాలన్నా.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఒకనాడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. బాధపట్టలేక పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేశానని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక స్కీమ్లు పెట్టుకున్నామని తెలిపారు. ‘ సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోదీ ఇవ్వలేదు.. అయినా సరే రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలు, రంజాన్ గిఫ్ట్లు, స్కూల్ యూనిఫాం కాంట్రాక్టులు ఇచ్చి కాపాడుకున్నాం. కనీసం నెలకు 15వేలు, 20వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం. కానీ ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్నింటిని బంద్ పెడతుంది.’ అని తెలిపారు. పాత బకాయిలు ఇవ్వడం లేదని.. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రంజాన్ తోఫా అందలేదని చెబుతున్నారని అన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు పని దొరుకుతుందని ఈ కార్యక్రమాన్ని పెట్టామని తెలిపారు. దాన్ని ఈ సర్కార్ ఎందుకు బంద్ పెట్టిందనేది ఆలోచించాలని సూచించారు. గుడ్డిగా ఓట్లు వేయడం కాదు.. ఎవరో చెబితే ఓట్లు వేయడం కాదు.. మన బతుకేంది.. మన ఆగమేందనేది ఆలోచన చేయాలని సూచించారు.
రైతుబంధు ఇవ్వడానికే వెనుకాడిన ఈ ప్రభుత్వం ధాన్యం కూడా కొంటలేదని కేసీఆర్ అన్నారు. కల్లాల్లో ధాన్యం తడిసిపోతుందన్నారు. వడ్లు తడిసిపోతుంటే కొనే దిక్కులేదని చెప్పారు. అందుకే ఆవేశంతో కాకుండా ఆలోచించి పార్లమెంటులో మనతో కొట్లాడే వ్యక్తి వినోద్కుమార్కు ఓటేయాలని సూచించారు. వినోద్తో పాటు చాలామంది గెలవబోతున్నారని కేసీఆర్ తెలిపారు. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ అని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో నెంబర్వన్ మెజారిటీ ఇచ్చి వినోద్కుమార్ను గెలిపించాలని అన్నారు.
ఆనాడు తెలంగాణను కాంగ్రెస్ అవమానిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేశానని.. అప్పుడు మీరే 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు. మళ్లీ ఈ కీలక సమయంలో ఈ కరీంనగర్ గడ్డ.. తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని.. గులాబీ జెండా గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఇక్కడ వినోద్కుమార్ గెలవాలని స్పష్టం చేశారు.