Supplements | సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడిని సంప్రదించి వారు సూచించిన ప్రకారం మందులను, సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటాం. కానీ నేటి కాలంలో చాలా మంది ప్రజలు ఎటువంటి సూచనలు, ప్రిస్క్రిప్షన్ వంటివి లేకుండానే మందులను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మనకు అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉంది. మనకు మనమే రోగాన్ని నిర్దారణ చేసుకుని మందులు వేసుకోవడం వల్ల మందుల మోతాదు పెరిగిపోవడమే కాకుండా అవి ఇతర మందులతో కలిసి అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. కనుక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడే ముందు వాటి మోతాదును, ప్రభావాలను తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
అనారోగ్యాన్ని తగ్గించడంలో మందులను తీసుకునే మోతాదు, సమయం ప్రభావం ఎంతో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. భోజనం తరువాత తీసుకోవడం వల్ల కొన్ని మందుల శోషణ పెరుగుతుంది. అలాగే కొన్ని మందులను మనం క్రమం తప్పకుండా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మందులను తగిన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుందని ఇవన్నీ తెలియకుండా మనం మందులను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గకపోగా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు విటమిన్లకు సంబంధించిన సప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని నీటిలో కరిగే, కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. విటమిస్ సి తో పాటు బి విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు. కనుక ఇవి మూత్రం ద్వారా రోజూ విసర్జించబడతాయి. కనుక నీటిలో కరిగే విటమిన్లను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
చాలా వరకు విటమిన్లను రోజులో ఏ సమయంలోనైనా, ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. అయితే ఆస్కార్బిక్ ఆమ్లాన్ని ఆహారంతో తీసుకోవడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చాలా మంది ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. ఖాళీ కడుపుతో ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు. అయితే ఇది కొందరిలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాంటి సమయంలో ఏదైనా తిన్న తరువాత తీసుకోవాలి. అయితే క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు వంటి ఆహారాలను తీసుకున్న తరువాత ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ను ఎక్కువగా గ్రహించదు. మెగ్నీషియం సప్లిమెంట్స్ ను కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. వీటిని ఎక్కువగా రాత్రిపూట తీసుకుంటారు. కొందరు నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి రాత్రిపూట మెగ్నిషియం సప్లిమెంట్స్ ను తీసుకుంటారు.
అయితే ఒకేసారి క్యాల్షియం, జింక్, మెగ్నీషియం సప్లిమెంట్స్ ను కలిపి తీసుకోకూడదు. వీటిని వైద్యుడి సూచన మేరకు ఏ సమయంలో తీసుకోవడం మంచిదో తెలుసుకుని తీసుకోవాలి. ఇక రోజులో అనేక సప్లిమెంట్స్ తీసుకునే వారు గందరగోళానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారు రోజూ ఎంత మోతాదులో ఏయే సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నామో, ఏ సమయంలో తీసుకుంటున్నామో ఒక రికార్డులో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సప్లిమెంట్స్ తీసుకునే విషయంలో గందరగోళం లేకుండా ఉంటుంది. మందులు లేదా సప్లిమెంట్స్ ఏవైనా కూడా వైద్యుడిని సంప్రదించిన తరువాత తీసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది. కనుక ఎవరూ కూడా వారి సొంతంగా మందులను, సప్లిమెంట్స్ ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.