హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): ల్యాబోరేటరీ సాయం లేకుండా గింజల్లోని పోషకాలను క్షేత్రస్థాయిలోనే గుర్తించేందుకు ఆధునాతన సాంకేతికతతో కూడిన నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్ఎస్) డివైజ్ను ఇక్రిశాట్ ఆవిష్కరించింది. అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేస్తుంది.
దీని సాయంతో గింజల్లోని ఓలిక్ యాసిడ్, కొవ్వు, లైనోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, ఫాస్పరస్ లాంటి సూక్ష్మ పోషకాల వివరాలను నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ పద్ధతులతో ఈ వివరాలను తెలుసుకునేందుకు రెండు వారాలకుపైగా సమయం పడుతున్నది. దీంతో రైతులతోపాటు కొనుగోలుదారులు, మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.