న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థయైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోలేకపోయాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.6,536 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. వడ్డీల రూపంలో వచ్చే ఆదాయం పెరగడం, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,498.15 కోట్ల లాభంతో పోలిస్తే 18.8 శాతం పురోగతి సాధించినట్లు పేర్కొంది. సమీక్షాకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.40,419.08 కోట్ల నుంచి రూ.39,865.80 కోట్లకు తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏకీకృత విషయానికి వస్తే రూ.27,070 కోట్ల ఆదాయంపై రూ.6,194 కోట్ల నికర లాభాన్ని గడించింది.