బాలీవుడ్ క్లాసిక్ తారల్లో ఒకరిగా రాణీ ముఖర్జీని చెబుతారు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారామె. ‘రాజా కీ ఆయేగీ బరాత్’ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టిన రాణీ ముఖర్జీ…‘చల్తే చల్తే’, ‘హమ్ తుమ్’, ‘వీర్ జరా’, ‘కభీ అల్విదా న కెహనా’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘నో వన్ కిల్డ్ జస్సికా’, ‘మర్దానీ’, ‘హిచీ’ ఆమె నటించిన విభిన్న చిత్రాలుగా చెప్పుకోవచ్చు. గ్లామర్ పాత్రలే కాదు ఆలోచింపజేసే సినిమాల్లోనూ ఆకట్టుకుని ఐకానిక్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్లో పాతికేళ్ల నట ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది నాయిక రాణీ ముఖర్జీ. అభిమానులు అందించిన ప్రోత్సాహమే ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు ఊతమిచ్చిందని చెప్పింది. భారతీయ మహిళకు ప్రతిబింబంలా నిలిచే ఎన్నో పాత్రల్లో నటించడం తనకు గర్వకారణమంది. రాణీ ముఖర్జీ మాట్లాడుతూ…‘పాతికేళ్ల నట ప్రయాణపు ఘనతను రచయితలు, దర్శకులు, అభిమానులకు ఇస్తాను. ఎప్పటికప్పుడు ఆ కాలపు భారతీయ మహిళలా కనిపించాను. బలమైన మహిళలకు ప్రతిరూపంగా ఉన్న పాత్రల్లో నటించాను. మంచి సినిమాలతో నా సిల్వర్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ అవడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.