న్యూఢిల్లీ: తాను చిన్నప్పటి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భక్తుడినని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన జీవితం, ఆలోచనల గురించి చాలా సార్లు చదివినట్లు తెలిపారు. బాబా సాహెబ్ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరుస్తానని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. అందుకే మన స్కూళ్లకు అంబేద్కర్ పేరు పెట్టడమే ఆయనకు నివాళులర్పించే ఉత్తమ మార్గమని అన్నారు.
ఢిల్లీలోని మొత్తం 30 ప్రత్యేక నైపుణ్య స్కూళ్లను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్లెన్స్గా పిలుస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బాబా సాహెబ్కు సంబంధించిన విద్యను స్కూళ్లలో తప్పనిసరి చేసినట్లు చెప్పారు. అలాగే అంబేద్కర్ సందేశం ప్రతి ఇంటికి చేరేలా చూడాలని నిర్ణయించుకున్నామని అన్నారు.