ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో ( Hostel ) చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హ్యుందాయ్ మోటార్ ( Hyundai Motors ) ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. లక్షల విలువైన సామగ్రిని స్థానిక అధికారులకు అందజేసింది. 295 బంక్ బెడ్లు, 590 పరుపులను సంస్థ ప్రతినిధులు అందజేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని 4 మొబైల్ టాయిలెట్లు, 50 దోమతెరలు, 15 ఫ్యాన్లను సమకూర్చారు. విద్యార్థులు వస్తువులను భద్రపరుచుకునేందుకు 130 ట్రంక్ బాక్స్లు 42 ఐరన్ రాక్లు, రెండు అల్మారాలను అందజేసింది. నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, మూడు మల్టీ ఫంక్షన్ ప్రింటర్లను అందజేశారు. వీటితో పాటు గ్రంథాలయానికి రెండు రాక్లు , తరగతి గదులకు 3 టేబుళ్లు, 8 ప్లాస్టిక్ కుర్చీలు, విద్యార్థులు కూర్చునేందుకు 6 విశాలమైన మ్యాట్లను పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్వర్, మిత్ర హోలిస్టిక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.