హైదరాబాద్ : శ్రీశైలం డ్యామ్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే కొనసాగుతోంది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక ఎంత చేరిందో తేల్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటినిల్వ 308.62 టీఎంసీలుగా ఉంది. 2009లో అనూహ్యంగా వచ్చిన వరదలతో నీటి నిల్వ 215.807 టీఎంసీలకు పడిపోయింది. ఇటీవల తెలంగాణ, ఏపీలోని జలాశయాల నిర్వహణను కృష్ణా బోర్డు తన పరిధిలోకి తీసుకోనున్నది. ఈ క్రమంలో ప్రస్తుత నీటి నిల్వను మరోసారి నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్వే సర్వే నిర్వహిస్తున్నారు. గడిచిన పదేళ్లలో శ్రీశైలం జలాశయంలో పూడిక ఏ మేరకు చేరిందో గుర్తించేందుకు సర్వే చేస్తున్నట్లు జలాశయ ఇంజినీర్లు తెలిపారు. 15 రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, జలాశయం సర్వే పూర్తయిన తర్వాత.. కర్నూలు పరిసర ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు వివరించారు.