పుణే: గతేడాది నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్లో శుభారంభం చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. స్టార్ ఓపెనర్ వార్నర్, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ను వదిలేసుకున్న సన్రైజర్స్, కొత్త పాత మేళవింపుతో బరిలోకి దిగనుంది. బ్యాటింగ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలకం కానుండగా.. పది కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసుకున్న నికోలస్ పూరన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అంతర్జాతీయ అనుభవం కంటే ప్రతిభ గల ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిన ఫ్రాంచైజీ.. అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్, సమర్థ్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగీ, శ్రేయస్ గోపాల్పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ పేస్ బాధ్యతలు మోయనుండగా.. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్లో కీలకం కానున్నాడు. మరోవైపు లీగ్ ఆరంభ సీజన్ మినహా ఇప్పటి వరకు ట్రోఫీ గెలువలేకపోయిన రాజస్థాన్ రాయల్స్.. ఈ సారి కప్పు నెగ్గాలని కంకణం కట్టుకుంది. కెప్టెన్ సంజూ శాంసన్తో పాటు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, బట్లర్, డసెన్, నీషమ్, అశ్విన్, చాహల్ వంటి ఆటగాళ్లతో రాయల్స్ పటిష్టంగా కనిపిస్తున్నది. మరి తొలి పోరులో ఎవరు బోణీ కొడతారో చూడాలి. లీగ్ ఆరంభం నుంచి బౌలింగ్ బలంతో విజయాలు సాధిస్తూ వచ్చిన హైదరాబాద్ ఈసారి అదే ప్లాన్లో ఉంది.