హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నది. ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగంలో అంచనాలకుమించి రాణిస్తున్న రాష్ట్రం..అటు ఆర్థికంలోనూ పెద్ద రాష్ర్టాలను తలదన్నెలా దూసుకుపోతున్నది. ఇదే క్రమంలో 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక రంగం ట్రిలియన్ డాలర్లు లేదా రూ.85 లక్షల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ చైర్మన్ సాయి డీ ప్రసాద్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.14.49 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నదన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ..సరాసరి 10 శాతం వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, హెల్త్కేర్, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో మూతపడుతున్న ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలపై మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే దేశవ్యాప్తంగా రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు రానున్నదన్నారు. అలాగే వ్యవసాయ రంగంతోపాటు తయారీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, విద్యా, టూరిజం రంగాలను ప్రోత్సహించడానికి పలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వచ్చే ఏడాది భారత వృద్ధి 6.5 శాతానికి పరిమితం కానున్నదని సీఐఐ అంచనావేస్తున్నది. ఈ ఏడాదిలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన..సీఐఐ ఆ మరుసటి ఏడాది మాత్రం వృద్ధిలో కోత విధించింది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటం ఇందుకు కారణమని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో సీఐఐ వైస్ చైర్మన్ ఆర్ఎస్ రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం సీఐఐ తెలంగాణలో 300 మంది సభ్యులు ఉన్నారని, ఈ ఏడాది మరో 50 మందిని చేర్చుకుంటున్నట్లు చెప్పారు.