అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై విరుచుకుపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అవినీతిని కక్కించి వారిని శిక్షిస్తామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చిత్తూరు ఎంపీ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డితో కలిసి ప్రచారంలో మాట్లాడారు.
ఉత్తర కోరియాలో కిమ్ మాదిరిగా ఏపీలో జిమ్(జగన్) పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు క్లాస్ వార్ (Class war) కాదని క్యాష్ వార్(Cash war) అని వెల్లడించారు. ప్రజల వద్ద నుంచి దోచుకున్న డబ్బును వసూలు చేసి శిక్షిస్తామని అన్నారు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి, జగన్ వాటా ఎంత ? అని ప్రశ్నించారు. నాడు వైసీపీ కేసుల కోసం ఎన్డీయేతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, తాము అభివృద్ధి కోసమే పొత్తులు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో అరాచకాలను వివరిస్తూ జిల్లా ప్రజలు బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) ని భూస్థాపితం చేస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మంత్రి లెక్కలేని తనం, దాడులు, దౌర్జన్యాలు, ఇసుక , మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదేనని ఆరోపించారు.
నియోజకవర్గంలో టీడీపీ నాయకులను, కార్యకర్తల ను అనేక ఇబ్బందులకు గురిచేసి క్షోభకు గురిచేసిన మంత్రిపై బదిలి తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు, నిత్యావసర ధరలు ఆకాశనంటాయని విమర్శించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్కల్యాణ్ అని ప్రశంసించారు.