హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 : ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో హ్యాకర్లు ఉపయోగించి న నాలుగు ఖాతాలను గుర్తించిన పోలీసులు అందులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు సర్వర్ నిర్వహణ బాధ్యత చూస్తున్న ముంబై సంస్థకు చెందిన ప్రతినిధులు గురువారం సర్వర్ హ్యాకింగ్ ఎలా జరిగిందనే విషయాన్ని పరిశీలించారు. శని, ఆదివారాల్లో బంజారాహిల్స్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని సర్వర్పై హ్యాకర్లు దాడి చేసి, రూ.12.93 కోట్లు కాజేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11న గోల్కొండ చిరునామాతో షాన్వాజ్ బేగం సిద్దిఅంబర్బజార్ బ్రాంచ్లో తెరిచిన సేవింగ్ ఖాతా, గతనెల 23న నాగోల్లో శాన్విక పేరుతో తెరిచిన కరెంట్ ఖాతాతోపాటు హుస్సేని ఆలంలో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరుతో ఉన్న వినోద్కుమార్కు చెందిన ఖాతా, కూకట్పల్లిలో ఫార్మా కంపెనీ పేరుతో ఉన్న సంపత్కు చెందిన ఖాతాల్లోకి హ్యాకర్లు ప్రధాన ఖాతా నుంచి డబ్బును ముందుగా బదిలీ చేశారు. అక్కడినుంచి దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకులలో ఉన్న 129 ఖాతాలకు డబ్బు బదిలీ చేశారు. మహేశ్ బ్యాంక్లో ముందుగా బదిలీ అయిన ఖాతాల వివరాలను సేకరించిన పోలీసులు వినోద్, సంపత్ను విచారిస్తున్నారు. ఖాతాలోకి డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. షాన్వాజ్ బేగం గోల్కొండలో ఉంటూ ముం బై, పుణెలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లి వస్తుంటుంది. ఘటన జరిగినరోజు షాన్వాజ్ బేగం సెల్ఫోన్ సిగ్నల్స్ పుణెలో వచ్చాయి. అక్కడే స్విచ్ఛాఫ్ అయ్యింది. ఖాతా తెరిచేందుకు ఉపయోగించిన చిరునామాలో ఆమె కుటుంబసభ్యులు ఉన్నట్టు గుర్తించారు. ఈ నలుగురి ఖాతాల్లోకి డబ్బులు డిపాజిట్ కావడం, అక్కడి నుంచి ఇతర ఖాతాలకు బదిలీ అయినప్పుడు ఓటీపీలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఖాతాదారులు ఎందుకు స్పందించలేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. సర్వర్ను చేతిలోకి తీసుకున్న హ్యాకర్లు ఫోన్ నంబర్లను మార్చారని పోలీసులు ముందుగా అంచనా వేశారు. ఖాతాదారులను విచారిస్తుండగా ఓటీపీలు వచ్చినట్టు వెల్లడైంది.
సర్వర్ ఎక్కడి నుంచి హ్యాక్ అయ్యింది..!
సర్వర్ను ఎలా హ్యాక్ చేశారనే విషయంపై పోలీసులతోపాటు బ్యాంకుకు సంబంధించిన ఐటీ బృందం కూడా ఆరా తీస్తున్నది. సర్వర్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు డాటాను డిలీట్ చేశారు. సర్వర్లోకి ఎలా ప్రవేశించారనే విషయంపై ఇప్పుడు పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. 129 ఖాతాల కు వెళ్లిన సమాచారం మాత్రమే పోలీసుల వద్ద ఉన్నది. అక్కడి నుంచి నేరగాళ్లు మరిన్ని ఖాతాలకు బదిలీ చేసి, డబ్బు డ్రా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 129 ఖాతాల్లో 60 ఖాతాల వివరాలు పోలీసులు సేకరించారు. మిగతా వివరాలు కూడా సేకరిస్తే డబ్బు ఎలా వెళ్లిందనే విషయంపై స్పష్టత వస్తుంది.
నిర్లక్ష్యంగా ఉండొద్దు..
మహేశ్బ్యాంకు సైబర్ దోపిడీ కేసు దర్యాప్తు లో పురోగతి ఉన్నదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేయించినట్టు చెప్పారు. ఖాతాలు తెరిచిన వారి వివరాలు సేకరించామని వెల్లడించారు. బ్యాంకింగ్ సర్వర్లో సరైన భద్రతా చర్యలు లేకపోవడమే హ్యాకింగ్కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. హ్యాకింగ్ను ఎక్కడి నుంచి రిమోట్ చేశారనే అంశాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలను వివరిస్తామని చెప్పారు. సైబర్ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.