హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో మరో మార్కును చేరుకొన్నది. నాలుగేండ్ల కాలంలో 20.80 మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. 2017, నవంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభం కాగా, ఈ నాలుగేండ్లలో మెట్రో రైలు హైదరాబాద్ వాసుల విశేష ఆదరణ సంపాదించిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కరోనాకు ముందు వరకు మూడు కారిడార్లలోని 69 కిలోమీటర్ల పరిధిలో ప్రతి రోజు 4 లక్షల మంది ప్రయాణం చేసేవారు.
2020 మార్చిలో లాక్డౌన్ విధించటంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. లాక్డౌన్ తర్వాత రైడర్షిప్ నెమ్మదిగా పుంజుకుంటున్నది. ప్రస్తుతం ప్రతి రోజు 2.40లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మెట్రో రైలులో నాలుగేండ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణం చేయడం ద్వారా సుమారు రూ.4.70 కోట్ల ఇంధనాన్ని ఆదా చేసినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఏటా సుమారు 27,500 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్టు అయ్యిందని వివరించారు.